వి.వి. సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు

September 13, 2026 0 Comments

▪️ అసోసియేషన్ నిధులకు రక్షణ
▪️ సెప్టెంబర్ 13న జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని కూకట్‌పల్లి నిలిపేసిన కోర్టు
▪️ నిబంధనల ప్రకారం రఘు మాస్టర్‌పై సుమలత విజయం చెల్లుబాటు అవుతుందని స్పష్టం
▪️ రఘు మాస్టర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్న వార్తలను తోసిపుచ్చిన‌ సంఘం
▪️ కొత్త సభ్యుల నమోదు ప్రక్రియను కొనసాగిస్తామన్న‌ సంఘం అధ్యక్షురాలు వి.వి. సుమలత దేవి

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న వివాదం న్యాయస్థానానికి చేరింది. సెప్టెంబర్ 13న ఇందిరానగర్‌లోని హోటల్ అనుపమలో కొందరు నిర్వహించ తలపెట్టిన జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లిలోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఈ వివాదంలో కే. రాఘవేంద్ర, వై. మెహర్ బాబులతో పాటు ఇతర ప్రతివాదులు అసోసియేషన్ పేరుతో ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, సంఘానికి చెందిన లెటర్ హెడ్‌లు, సీళ్లు, మినిట్స్ బుక్, అధికారిక సంతకాలను ఉపయోగించడంగానీ, బ్యాంకులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయడంగానీ చేయకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులు, దాఖలైన సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు వి.వి. సుమలతా దేవి, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఇజ్రాయెల్ మాట్లాడారు. 2025–2027 కాలానికి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ కార్యవర్గం మాత్రమే అసోసియేషన్ పాలనను, అధికారిక వ్యవహారాలను నిర్వహించేందుకు చట్టబద్ధమైన హక్కు కలిగి ఉందని వారు స్పష్టం చేశారు. రఘు మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధమని, నిబంధనల ప్రకారం సుమలతా దేవి విజయం సంపూర్ణంగా చెల్లుబాటు అవుతుందని తెలిపారు.

గత ఆగస్టు 30న ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు చట్టవిరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేసి, కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని సుమలతా దేవి ఆరోపించారు. యూనియన్ అధికారిక ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు నకిలీ లేఖలు పంపడం ద్వారా ఖాతా సంతకాలను మార్చేందుకు కుట్ర పన్నారని తెలిపారు. దాదాపు ₹4 కోట్లు ఉన్న సభ్యుల సంక్షేమ నిధులను కాపాడేందుకే తాము కోర్టును ఆశ్రయించామని, ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని వివరించారు. ఇకపై అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ల ఉమ్మడి సంతకాలతోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, లేబర్ ఆఫీస్ (JCL) మార్గదర్శకాల ప్రకారమే నూతన సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.

ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు, ప్యానెల్ ఇన్ ఛార్జీల నిబంధనలను కఠినతరం చేయడాన్ని తట్టుకోలేక ఈ కుట్రలకు తెరలేపారని జనరల్ సెక్రటరీ ఆరోపించారు. కాగితాలపై సంతకాలు పెట్టి నలుగురు కలిసి కమిటీగా ఏర్పడితే అది న్యాయస్థానాల దృష్టిలోగానీ, యూనియన్ నిబంధనల ప్రకారం గానీ చెల్లదని స్పష్టం చేశారు. నకిలీ లెటర్ హెడ్లతో అయోమయం సృష్టించిన వారికి కోర్టు ఉత్తర్వులే తగిన సమాధానమని ట్రెజరర్ ఇజ్రాయెల్ పేర్కొన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని, ఫెడరేషన్ పెద్దల సమక్షంలో నాలుగు ఐదు రోజుల్లో అధికారికంగా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మిగిలిన సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకుంటామని నాయకులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే యూనియన్‌కు వచ్చి మాట్లాడాలని నృత్య కళాకారులకు, డాన్స్ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *