వైసీపీ నాయ‌కులపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

March 5, 2026 0 Comments

అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర ఎద్దేవా చేశారు. 33 రోజులు తనను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించి, అణువణువూ జల్లిడపట్టినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై తప్పు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు.

శాసనమండలిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్థించి దేవుడితో ఆటలాడుతున్నారని, అది మంచిది కాదని హితవు పలికారు. సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో, హెరిటేజ్‌ సంస్థకు ఇందాపూర్‌తో ఏ లింకులు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సంస్థలు ఒకటే అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనాలని టీటీడీ మెయిల్స్‌ ఎందుకు పంపిందని ఈ సందర్భంగా టీడీపీ నేత ధూళిపాళ్ల నిలదీశారు.

వైసీపీ నాయకులవి అన్నీ ఫేక్ బతుకులని, వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్పింగ్‌లు చేయడం వారి పేటెంట్ హక్కులని ధూళిపాళ్ళ మండిపడ్డారు. గతంలో తనను 33 రోజుల పాటు జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ ఎంత వెతికినా ఒక్క తప్పు కూడా దొరకలేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుర్తుచేశారు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయాంలో కూడా తాను దేనికీ భయపడలేదని.. ఇప్పుడు ఎందుకు భయపడతాను అన్నారు.

‘కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కాళ్లమీద పడ్డ బందరు బియ్యం దొంగ పేర్ని నాని నీతులు చెప్పటం హాస్యాస్పదం. బందరు ఊసరవెల్లి చెప్పగానే రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు నేను రంగులు వేశానని చెబుతంటే నవ్వొస్తుంది. సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలది. వెబ్‌సైట్లు డౌన్ చేసి, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు వాళ్లవి ఫేక్ బతుకులు. రాజధాని అమరావతి అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పాను, ఈరోజు కూడా అదే మాట చెప్తున్నా’నని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ తన న్యూస్ పేపర్, ఛానల్‌కు రూ. 307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ ద్వారా కాంట్రాక్టర్ల నుండి 3 లక్షల టన్నుల సిమెంట్‌ను మాయం చేశారని విమర్శించారు. తనపై పెట్టిన 22 తప్పుడు కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం వాటిని పరిశీలించి తప్పులేదని తేలితే ఆ కేసులను ఎత్తేయాలని కోరారు.

తిరుపతి లడ్డు కల్తీ కావడం వాస్తవమని, అందులో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు NDDB నివేదికలు ధృవీకరించాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకు రూ. 12.5 కోట్లు, చెన్నైకి రూ. 7.5 కోట్లు చేరినట్లు సిట్ (SIT) రిపోర్టులో వెల్లడైందని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో వెన్న ధర రూ. 360 ఉంటే, కేవలం రూ. 316కే నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నేతలే చెప్పాలని ప్రశ్నించారు.

సంగం డెయిరీ 2020, 2021 నుండి టీటీడీ నెయ్యి టెండర్ల కోసం ప్రయత్నిస్తోందని, నిబంధనలు, శాస్త్రీయ పరీక్షల తర్వాతే తమకు అవకాశం వచ్చిందని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి అసలు నెయ్యి సరఫరా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించేది తమ సంగం డెయిరీయేనని, దీనిపై ఎవరికైనా సవాల్ విసురుతున్నానని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *